Tuesday 24 September 2013

భలే మంచి రోజు!!

యువనేతకు బెయిల్ మంజూరు!
సోమవారం ఇదే శిఖర వార్త!
కాదు కాదు, అదొక వైరస్ వార్త!
ఈ వార్తా వైరస్ సృష్టించిన కల్లోలం ముందు మొత్తం వైరస్ జాతంతా సిగ్గుతో తలదించుకుంది!
మొదట తెలుగు మీడియా కోడై కూసింది!
ఆపై జాతీయ మీడియా జోరీగై జనం చెవుల్లో చిల్లులు పెట్టింది !!
ఆపై ప్రపంచ మీడియా.. ఎలా స్పందించిందో వీక్షించలేకపోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు!!
ఆమధ్య ఉట్టి పుణ్యానికే ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టేశానని ఎవడన్నా ప్రకటించినా సరే, ఈ లెవెల్లో మీడియా స్పందిస్తుందో, లేదో? నాకైతే డౌటే! రాష్ట్ర ఆశాజ్యోతి యువనేత విషయంలో మీడియా నిష్పక్షపాత విశృంఖల విలయతాండవ వైఖరి చూసి ముచ్చటేసింది. మీడియా సృష్టించిన 24 గంటల దావానల వైరస్ వార్తా స్రవంతిలో మొదట హైదరాబాదు, పిమ్మట రాష్ట్రమ్మొత్తం, తదుపరి దేశం యావత్తూ  తడిసి ముద్దైపోయి, తరించిపోయింది. పాపం, ప్రజలకే ఈ వార్తను చూసి సంబురాలు జరుపుకోవాలా? లేక ముక్కున వేలేసుకోవాలా? లేక బిక్కమొగమేస్కుని మిన్నకుండిపోవాలా? అసలేం చేయాలో అర్థం కాక సైలెంటుగా ఉండిపోయారు. జనం ఖర్మ కాకపోతే, అదేంటో, మీడియా ఎప్పుడూ ప్రజల భావోద్వేగాలకు పెను సవాళ్లను విసురుతుంటుంది. సర్లే, ఈ బెయిల్ విషయమై కవులు, కళాకారులు, పండితులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఎలా స్పందిస్తారో చూసి, ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని ప్రజలు డిసైడైపోయి జడత్వంలోకి జారుకున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే.... 


‘‘ఇదొక శుభదినం.
రాష్ట్ర చరిత్రలోనే, కాదు కాదు, దేశ చరిత్రలో ఒక పర్వదినం.
మన యువనేత రాజకీయాలకే తలమానికమై నిలిచాడు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా; అస్సాం నుండి గుజరాత్ దాకా ఎవ్వడూ సాధించలేని ఘనతను మనవాడు సాధించాడు. రికార్డులన్నీ మన యువనేతవే. ఆస్తులు కూడబెట్టడంలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. కారాగారవాసంలో సైతం కొత్త పోకడలు సృష్టించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా బెయిల్ సాధించాడు. కొమ్ములు తిరిగిన హైకమాండునే ప్రసన్నం చేసుకున్నాడు. ఇంత జరిగినా ఏమాత్రం ఆదరణ తగ్గకుండా మ్యాజిక్ చేస్తున్నాడు. భేష్!  ఇకపై నేతలెవ్వరూ అవినీతికి, అక్రమార్జనకు పాల్పడేందుకు ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. జైళ్లకెళ్లేందుకు అస్సలు సిగ్గు పడక్కర్లేదు. బెయిల్ దక్కదేమో అన్న బెంగను ఇహ తుంగలో తొక్కవచ్చు. ఇకపై అన్నింటికీ, మనందరికీ యువనేతే మార్గదర్శి!! పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం (అ)రాజకీయాల్ని వెలగబెట్టేందుకు. ప్రజాధనం కొల్లగొట్టేందుకు... ’’ అంటూ చెంచల్ గూడ జైలు ముందు ఓ మీటింగు పెట్టేసి మాటల తూటాలతో మైకును విరగ్గొడుతున్నాడు ఓ గల్లీ లెవెల్ లీడర్... మిగతా గల్లీ లెవెల్ అమెచ్యూర్ లీడర్లనుద్దేశించి!

‘‘ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చు. గుండె మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. జన గర్జనలు అక్కర్లేదు. సాగర ఘోషలు అవసరం లేదు. మిలియన్ మార్చులు చేయాల్సిన పనిలేదు. ఉద్యోగులు ముష్టియుద్ధాలు చేసుకోనక్కర్లేదు. యువకులు ఆత్మహత్యలు పాల్పడనక్కర్లేదు. దుష్టచతుష్టయం హైకమాండు బారిన పడి రాష్ట్రం రెండుగా విడిపోతుందా లేక మూడు ముక్కలైపోతుందా అన్న ఆందోళనలు అసలే అక్కర్లేదు. ఏది ఏమైనా, ఏది ఏమీ కాకపోయినా, తెలుగుజాతిని భుజం తట్టి, వెన్ను చరచి, ఆలింగనం చేసుకుని, ఓదార్చి, సాంత్వన చేకూర్చడానికి యువనేత జైలు గోడల్ని బద్ధలు కొట్టుకుని మళ్లీ మనమధ్యకు వచ్చేశాడు. ఇక భయం ఎంతమాత్రం అవసరం లేదు. వచ్చేశాయ్ వచ్చేశాయ్, జగన్మాథ జగన్నాథ, జగన్ నాథుడి రథ చక్రాల్... ’’ అంటూ తెలుగుజాతి ఆత్మశాంతి సభలో అవిరళంగా ఓదార్పు వచనాలు పలుకుతున్నాడు ఓ ప్రవక్త. 

‘‘ఈ రోజు... భలే మంచిరోజు. యావద్భారతానికి అభయహస్తం లభించిన రోజు. ఇకపై ఉల్లి ధర గురించి లొల్లి చేయాల్సిన పనిలేదు. పాతాళానికి పడిపోయిన రూపాయి బూస్ట్ తాగి రివర్స్ బంగీ జంప్ చేసి ఆకాశానికి ఎగురుతుంది. స్టాక్ మార్కెట్లో ఇక మీదట రోజూ బుల్ రన్ కొనసాగుతుంది. ఐసీయులో స్ట్రెచర్ మీదున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇక నిషేధిత స్టెరాయిడ్స్ తీసుకున్న రన్నర్ లా దూసుకుపోతుంది. వ్యాపారం కోసం, పెట్టుబడుల కోసం ఇకపై అమెరికోడి ముందు బాంచన్ కాల్మొక్త అని వెంపర్లాడిన అవసరం లేదు. జాతి యావత్తూ ఇకపై సుభిక్షంగా ఉంటుంది. యువనేత పునరాగమనంతో గత ఏడాదికాలంగా త్రిశంకుస్వర్గంలో, చీకట్లో మగ్గిపోయిన అపార ధనరాశులు ఇకపై నిప్పులు చిమ్ముకుంటూ బయటకొచ్చి పెట్టుబడులుగా ప్రవహించి అటు వ్యవసాయాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి జాతిని సుభిక్షం చేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఉందిలే మంచికాలం ముందుముందునా... అందరూ సుఖపడాలి నంద నందనా...  ’’ అంటూ ఢిల్లీలోని వార్ రూమ్ అధిష్ఠాన సమావేశంలో మౌనవ్రతాన్ని వీడిన మన్మోహన్ సింగు మాంచి మెలోడి పాడుకుంటూ మెడిటేషన్ లోకి వెళ్లిపోయాడు. 


మళ్లీ మీడియా విశ్వరూప సందర్శనానికొద్దాం. మర్నాడు రాజధానిలో అంగుళమంగుళం కెమెరాల మోహరింపులు జరిగిపోయాయి. గల్లీగల్లీ చివర ఓ రిపోర్టరు నిరంతర వార్తా స్రవంతిని అందజేస్తున్నాడు. చెంచల్ గూడ దగ్గర మీడియా తొక్కిసలాట... మునుపటి తొక్కిసలాటల రికార్డుల్ని బద్ధలుకొట్టింది. టీవీల్లో స్టూడియాల్లో పండితుల, మేధావుల అపూర్వమైన, అద్భుతమైన చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసా...గుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంత జరిగినా, జరుగుతున్నా... యువనేత బెయిల్ విషయమై ఇంకా ఎలాంటి భావోద్వేగంతో స్పందించాలో తెలీక జనం తికమకపడుతూనే, గందరగోళపడుతూనే ఉన్నారు. పాపం... జగన్ కష్టాలు, ఇప్పడు జనానికొచ్చినట్టున్నాయ్! హతవిధీ!!

21 comments:

  1. హ్హుహ్హుహ్హహ్హ్హహ్హహ్హుహ్హుహ్హహ్హహ్హ్హ్హ్హహ్హ్హహ్హుహ్హుహ్హుహ్హ్హ్హహ్హ్హ్హహ్హహహ్హుహ్హుహ్హ్హహ్హ్హహ్హ్హహ్హుహ్హు..

    ఏడవలేక నవ్వు

    ReplyDelete
  2. ఏడవలేక నవ్వు తున్నానండీ బేర్...

    ReplyDelete
  3. జనాలకు ఇలాంటి విషయాలు సర్వసాధారణం అయిపొయాయి సార్ ...మీడియా కోడై కూసినా, వార్తా పత్రికలు వార్తలు నాలుగు రకాలుగా గుప్పించినా జనాలు విచక్షనను కోల్పోనంతవరకు ఫరవాలేదు..

    ReplyDelete
    Replies
    1. నవజీవన్ గారు,
      మీరన్నది నిజమే. అయితే, జనాలకు ఇలాంటి విషయాలు సర్వసాధారణం అయిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం. నిత్యం ధరలు పెరగడం సర్వసాధారణం, అమ్మాయిల మీద అత్యాచారాలు జరగడం సర్వసాధారణం, రాజకీయ నేతలు అవినీతి జరగడం సర్వసాధారణం... ఇలాంటి లెక్కలేనన్ని సర్వసాధారణాలను ప్రజలను అలవాటు చేస్తూ వారిలో విచక్షణను దెబ్బతీస్తున్నది ప్రధానంగా వార్తాపత్రికలు, మీడియానే కావడం గమనార్హం. ఈ పత్రికలు, టీవీ ఛానెళ్లన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాయడం ప్రజల ప్రారబ్దం!

      Delete
  4. ముఖ్యంగా ... అద్భుతమైన పదాలు "ధర్మ విజేత" "కడిగిన ముత్యం"...

    వాహ్ వాహ్

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ,
      సంచలన వార్తల సంక్షోభంతో విలవిల్లాడిపోతున్న మన మీడియాకు - నీళ్లు లేని ఎడారిలో Kinlay వాటర్ బాటిల్ దొరికినట్టు, ఆకలితో అలమటిస్తున్న అర్భకుడికి KFC చికెన్ ముక్క దొరికినట్టు - జగన్ బెయిల్ న్యూస్ దొరకడంతో, ప్రాంతీయ/జాతీయ మీడియా మొత్తం... జగనంత కుటుంబం మాది అని పండగ చేస్కుంటోంది. అదేదో పెళ్లికి అదేదో హడావుడి అనేదేదో పాత సామెత గుర్తుకొచ్చి చావట్లేదు. ఛ :)

      Delete
  5. Super write up.


    Surabhi

    ReplyDelete
  6. నాగరాజ్/సుజాత గార్లూ,
    జగన్ అవినీతి ఆధారలగురించి CBI ఎక్కని గుమ్మం లేదు. మరి మీదగ్గరేమన్నా వున్నా, పోనీ ఫలానా చోటదొరకొచ్చని తెలిసినా పసుపు,కుంకుమ పత్రికలకొక లీక్ వదిలితే పోయెదిగా వాళ్ళు చూసుకునేవాళ్లు. ఆ రెండు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మీరే జడ్జిమెంట్ యిచ్చేస్తున్నారు. అతని అవినీతిగురించి రుజువయ్యేదాక ప్రజలెందుకు నమ్మాలి? చంద్రబాబు భూపందేరాలగురించి లక్షప్రశ్నలేసినా ఒక్ఖ సమాధానం లేదేం?

    ReplyDelete
    Replies
    1. షాయి గారూ..
      ప్రస్తుత రాజకీయాల్లో దుర్భిణీ వేసి వెదికినా ఒక్కరంటే ఒక్కరు కూడా అవినీతిపరులు కానివారు దొరకరేమో. ఆ విషయం అందరికీ తెలిసిందేనండి. రెండు కళ్ల థియరీ బెడిసికొట్టి చివరికి ఏం చేయాలో పాలుపోక, మీడియాలో కనిపించడానికి నా ఆస్తి కేవలం రూ. 40 లక్షలే అని నెత్తీనోరూ ఎన్నిసార్లు కొట్టుకున్నా, ఒకటో తరగతి చదివే పిల్లలు కూడా ఆ మాటలు నమ్మరన్న విషయం కూడా తెలిసిందే. నిజానికి ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు. అవినీతి చేయడం, అక్రమంగా ఆర్జించడం, అరుదుగా కొందరి గ్రహస్థితి బాగోలేక కొన్నాళ్లు జైళ్లకు విహారయాత్రకు వెళ్లడం, తీరా కోర్టుల్లో ఆ కేసులు వీగిపోయి, దర్జాగా కాలరెగరేసుకుంటూ బయటకొచ్చేసేయడం అన్నది ఇవాళ రాజకీయాల్లో కామన్ గా తయారైంది. చట్టం ఉన్నవారి చుట్టమని ఇప్పుడిక మనం ఢంకా బజాయించి చెప్పొచ్చు. దురదృష్టమేమంటే, రాజకీయనాయకులు పందికొక్కుల్లా (మనం పన్నుల రూపేణా కట్టిన) కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మేస్తుంటే, మనమే కులాల/మతాల/ప్రాంతాల ప్రాతిపదికన వారిని సపోర్ట్ చేస్తున్నాం. మరొక దారుణమైన విషయమేమంటే, పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు/మీడియా... గోబెల్స్ దుర్నీతిని అనుసరిస్తూ అవినీతిపరుల్ని, నేరస్థుల్ని, గూండాల్ని హీరోలుగా చిత్రిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం. ఒక్క చంద్రబాబు, జగన్, కేసీఆరే కాదు... దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ ఏదో ఒక రూపేణ అవకాశవాదానికో, అవినీతికో పాల్పడుతున్నవారే. ఒక్క జగన్ అవినీతే కాదు, ఇక మీదట ఏ రాజకీయ నాయకుడి అవినీతి కూడా రుజువు కాదు కాక కాదు. ఆ దిశగా మన నేతలు అద్భుత పురోగతి సాధించారు. పోనీయండి, ప్రజల్లో చైతన్యం వచ్చి ఆర్గనైజ్ అయ్యేంతవరకు వీరి ఆగడాల్ని భరించక తప్పదేమో.

      Delete
  7. నాగరాజ్ గారూ,
    మీతో 100% ఏకీభవిస్తున్నాను.. నా ప్రశ్నేమిటంటే మొన్న చంద్రబాబు తనయిల్లు 23 లక్షలే అన్నప్పుడు, తన ఆస్థి యింతే అన్నప్పుడు 'అద్భుతం వాహ్ వాహ్' అని ఒక్ఖ కామెంట్ కూడా కనిపించలేదు... మరి ఈ అవినీతికి ఫిల్టెర్స్ ఎమన్న వున్నయ్యా అని?

    ReplyDelete
    Replies
    1. షాయి గారూ,
      ఫిల్టర్స్ ఏమీ లేవండి. లాస్ట్ టైమ్ చంద్రబాబు ఆస్తులు ప్రకటించినప్పుడు నేను బ్లాగులో అంత యాక్టివ్ గా లేను. లేదంటే కచ్చితంగా రాసుండేవాణ్నే. నిజానికి చంద్రబాబు అస్సెట్స్ గురించి ఎవరు చీల్చి చెండాడినా సెభాష్, అద్భుతం, వాహ్వా, జిందాబాద్ లాంటివి అనడానికి నాకు ఇసుమంత కూడా అభ్యంతరం లేదు. ఈసారి సందర్భం వస్తే నాయుడు గారి(ఆస్తుల గోల)కి కూడా ఒక పోస్టు అంకితమిచ్చే ప్రయత్నం చేద్దాంలెండి. థాంక్యూ :)

      Delete
  8. షాయి గారూ, నేను రిజర్వేషన్ల వ్యతిరేకిని! :-) చంద్రబాబైనా , మరెవరైనా ఒకటే నాకు. బ్లాగులు చూడటం లేదు ఈ మధ్య! నాగరాజ్ మిత్రులే అయినా ఆయనకు బ్లాగ్ ఉందని నిన్నే తెల్సింది. :-)

    చంద్రబాబు అవినీతి గురించి ఎవరైనా రాసింది చదివుంటే అక్కడ కూడా వాహ్ అని మెచ్చుకునే దాన్నే

    చంద్రబాబు ఆస్తులు 40 లక్షలని తెల్సి నాకు కోపం తెచ్చుకోవాలో , నవ్వాలో తెలీక విరక్తి తో శాంతం వహించి కూచున్నా టీవీలో వార్తలు చూస్తూ (హైద్రాబాదు లో మాలాంటి మిడిల్ క్లాసోళ్ళ ఫ్లాటు ఖరీదే 70 లక్షలు!)

    నాగరాజ్, ఏమిటండీ ఈ మీడియా ఛానెళ్ళ గోల.. ఏ ఛానెల్ పెట్టినా మాకు మిట్ట మధ్యాహ్నం (మీకు అర్థరాత్రి) అయ్యే వరకూ అదేనా లైవ్ లో ఇక? :-((

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ,
      నా పేరు మీద ఓ బ్లాగుందనే విషయం నాకూ జస్ట్ రెణ్నెళ్ల క్రితమే తెలిసిందండి. అప్పుడెప్పుడో ఓ ఫ్రెండ్ బ్లాగ్ ఓపెన్ చేసిస్తే, సెభాష్, నేనూ ఓ బ్లాగువాడినయ్యానని బోల్డు సంబరపడిపోయి, ఆ విషయాన్ని అక్కటికక్కడే అప్పటికప్పుడే దారుణంగా మరిచిపోయి, తీరా తెలుగువెలుగు మేగజైన్లో ఉత్తమ బ్లాగుల పేరిట జ్యోతిగారు రాసిన రైటప్ చదివాగ్గానీ నాక్కూడా ఓ బ్లాగుందనే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకురాలేదు. శని శీతకన్ను వేసి, కుజుడు వక్రకంట చూట్టంతో నేను ఓ మూడేళ్లపాటు బ్లాగ్ వియోగానికి గురయ్యానని అంజనం వేయిస్తే తెలిసింది. పోనీయండి, Better late than never అని నన్ను నేను ఓదార్చుకుని, ఈనాడులో వేసుకున్నవి, వేసుకోనివి అన్నీ కలిపి ఇక్కడ పోస్టు చేయడం మొదలెట్టాను. అదండీ విషయం :)

      ఈ ఛానెళ్ల గోల గురించి మీకు తెలిందేముందండి. బాలయ్యబాబు కంటిచూపుతో, టీవీ ఛానెళ్లు లైవ్ కవరేజ్ తో జనాన్ని చంపడం కామనైపోయింది. Of late, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే... జగనంత కుటుంబం మాది - అని టీవీ ఛానెళ్ల పాడుకుంటుంటే; సన్నాసి మీడియా మాది - అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ప్రస్తుతం ఛానెళ్లన్నీ కట్టకట్టుకుని జగన్ ను ఓదారుస్తున్నాయ్. మనం కొంతకాలం భరించక తప్పదు. :-)

      Delete
  9. ఏడ్వలేక .. నవ్వు కూడా రావడం లేదు . చానల్స్ ని , ప్రింట్ మీడియా ని టచ్ చేయకుండా ఉంటె చాలా మంచిది . లేకపోతే మనం వాళ్ళలాగా ఆలోచిస్తాము. ఆయుధం మన చేతిలో ఉంది దాని గురించి ఆలోచిస్తే మంచిది . మీ పోస్ట్ మాత్రం చాలా చాలా బావుంది :)

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే. మనమెలా ఆలోచించాలో కూడా మీడియానే డిసైడ్ చేసేస్తోంది. నిజానికి ప్రజల ఆలోచనాతీరును ప్రభావితం చేసే వాటిల్లో మీడియా అన్నది అత్యంత శక్తివంతమైన మాద్యమం. దురదృష్టమేమంటే, మీడియాలోకి విశృంఖల వ్యాపార సంస్కృతి ప్రవేశించడంతో, అది మంచి కంటే కూడా చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. మార్పు కోసం కొంతకాలం వేచిచూడక తప్పదేమో.

      Delete
  10. Chandrababu declared his 'personal' assets as 40lakhs and 'family' assets at 41crores (government valuation). Also, he reported about his family businesses (Heritage etc) separately, which again is not his 'personal' wealth. Per my understanding, Politicians (Business People as well) usually do not keep wealth as their personal assets, but as 'family' assets or 'business' assets. If his 'family' wealth is assessed at market value, it would easily be valued at 10 times, is my guess. So, your assumption/understanding of Chandrababu's assets declared as 40lakhs is not correct :) Atleast, he declared all his legal assets and I appreciate that.

    ReplyDelete
    Replies
    1. Anonymous:
      Regarding Babu assets, your guess is 10 times; I expect its 100 times, but media strongly opine that it would be easily 400 times more. What to believe? Right now, its a million dollar mystery. Hope, babu will again come out with some reasonable amount soon to clear this big puzzle :-)

      Delete
  11. థాంక్యూ, రాజ్ :-)

    ReplyDelete