Saturday 23 May 2020

లాక్డౌన్ క్రియేటివిటీ!

లాక్డౌన్ క్రియేటివిటీకి కొత్త రెక్కలు తొడిగింది. ఒకప్పుడు మగాళ్లు వంటింటికి భౌతికదూరం పాటించేవారు. కరోనా పుణ్యమాని ఇప్పుడు కిచెన్ తో క్యారమ్స్ ఆడేసుకున్నారు. వేళ్లూ కాళ్లూ చేతులూ ఒళ్లూ అన్నీ కాల్చేసుకుని వంటల్లో నలభీముల్ని మించిపోయారు. ఒకప్పుడు సెలవుల్లో పిల్లకాయలు పందిరేయడానికి ఇల్లు పీకి పాతరేసేవాళ్లు. ఇప్పుడు ఎంచక్కా సెల్లు పీకి ప్లే స్టేషన్లూ, ప్రపంచ యుద్ధాలు చేస్తున్నారు. సాగదీత సీరియళ్లు, అమ్మలక్కల ముచ్చట్లూ గట్రా లేకపోయినా ప్రశాంతంగా ఉండగలిగే స్థితప్రజ్ఞతను ఆడాళ్లు సాధించేశారు. ఐటీ కుర్రాళ్లు వీకెండ్ పార్టీల్లేకుండానే బతికేయడం నేర్చుకున్నారు. ఒకప్పుడు సెలెబ్రిటీలు మేకప్, ప్యాకప్ లతో మాత్రమే సహజీవనం చేసేవారు. ఇప్పుడు సెలెబ్రిటీల్లో కొందరు అంట్లు తోమారు. కొందరు బట్టలుతికారు. కొందరు దోశలేసారు. కొందరేమో సొంతంగా గుండు కూడా గీసుకున్నారు. ఇక, కొందరు లేడీసేమో భర్తల నెత్తి పైభాగాన తమ చేతికందేంత జుట్టు మాత్రం వదిలి, చుట్టూరా డిప్ప కటింగు కొట్టే నేర్పు సాధించారు. సంప్రదాయ మాస్కులు, సరసమైన శానిటైజర్లు, వినూత్నమైన వెంటిలేటర్లు... ఇలా కొత్తరకం కుటీర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. కొందరు మొబైల్లోనే పూజలు, వ్రతాలు చేయించారు. కొందరైతే ఫోనుకే తాళితో మూడు ముళ్లేసి పెళ్లి కానిచ్చేశారు. ఇలా లాక్డౌన్ క్రియేటివిటీని ఏకరవు పెడితే ఏకంగా ఉద్గ్రంధమవుతుంది. 

నిజానికి, సామాన్యులు ఎంత ఘనకార్యం చేసినా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ సెలెబ్రిటీలు చిన్న రిబ్బను ముక్క కట్ చేసినా జనాల్లో అదో ఆసక్తి. అయితే, సెలెబ్రిటీలకు మించిన లెజెండ్స్ కొందరుంటారు. వారేం చేసినా అది ట్రెండ్ సెట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొందరు లెజెండ్స్ లాక్డౌన్ వేళ ఏం చేశారో వారి మాటల్లోనే చూద్దాం. 

‘ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట... మేడిన్ చైనా! వాళ్లేంటో, వాళ్ల తిండి తీర్థాలేంటో, వాళ్ల విచిత్ర వేషధారణేంటో, అబ్బే, అసలు చైనా అంటేనే ఎలర్జీ నాకు. ఇప్పటికే అర్థమయ్యుండాలి నేనెవరో? యెస్, నేనే...అమెరికా ట్రంప్ కార్డ్, డోనాల్డ్ ట్రంప్! పోయినేడాది నా ఎడంకన్ను అదో మాదిరిగా అదిరినప్పుడే అనిపించింది. చైనా ఇట్టాంటి కొంపముంచే పనేదో చేస్తుందని. నిజానికి ఈ భూమ్మీద కొంపలు ముంచినా, ఆర్పినా అది మేమే చేయాలి. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారానికి ఇటీవల చైనా గండికొడుతోంది. అందుకే మాకు చైనా అంటే అంత కడుపుమంట. ఇప్పుడీ చైనీస్ కరోనా దెబ్బకు మా దేశం కకావికలమైంది. అందుకే ఈ లాక్డౌన్ వేళ నా శ్వాస, ధ్యాస అన్నీ ఒక్క చైనాపైనే కేంద్రీకరించా. కరోనా సృష్టి చైనాపనేనని రుజువు చేయడమే నా ధ్యేయం. ప్రపంచంలో అల్లకల్లోలానికి, ఆర్థిక మాంద్యానికి కారణం చైనాయేనని దుమ్మెత్తిపోస్తా. నా శత్రువును ప్రపంచానికే శత్రువును చేస్తా. ఇదే నా శపథం. నా ఈ లాక్డౌన్ మిషన్ పేరు... ఆపరేషన్- డ్రాగన్ పరేషాన్!’ 

‘మోడీ, ట్రంపు, పుతిన్, మోర్కెల్ ఎవ్వరైతేనేం? వీరి కుర్చీ కాలం అయిదేళ్లే. మహా అయితే పదేళ్లు. కానీ, నా కుర్చీకి కాలం చెల్లడమనే మాటే లేదు. చైనాకు నేనే జీవితకాల చక్రవర్తిని! మోనార్కులకే మోనార్కుని! నియంతలకే మహానియంతను! నేనే జిన్ పింగ్! డ్రాగన్ స్వైరవిహారాన్ని ఎవ్వరూ ఆపలేరు. కరోనా - మేడిన్ చైనా అంటూ ఈ కాకుల గోలేంటో?! వీళ్లకసలు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? పదార్థాన్నెవ్వరూ సృష్టించలేరు, నాశనం చెయ్యలేరు. కరోనా కూడా అంతే. కాకపోతే ఈ లాక్డౌన్లో నేనొకటే ఆలోచించా. ఖర్మకొద్దీ కరోనా వచ్చింది. దాన్ని చైనాకి అనుకూలంగా వాడుకుంటే పోలా? కరోనా కల్లోలాన్ని వాడుకుని అమెరికా ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతా. ప్రపంచమంతా మేడిన్ చైనా మంత్రం జపించేలా చేస్తా. నా లాక్డౌన్ మిషన్ పేరు.. ఎంటర్ ది డ్రాగన్!’ 

‘ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది ఇంకోదారి. ఊరు, ఉలిపికట్టె ఇవేవీ నడవని దారే... ఉత్తరకొరియాది! మాదో చీకటిదేశమని ఊరికే ఆడిపోసుకుంటారు కదా. నిజమే. ఉట్టినే పనీపాడూ లేకుండా వేరే  దేశాలతో రాసుకుపూసుకు తిరిగే రకం కాదు మేం. అందుకే మా దేశంలో కరోనా కేసుల సంఖ్య.. జీరో! కాబట్టే, మాకు క్వారంటైన్లు లేవు, లాక్డౌన్లు అసలే లేవు. ఇక ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్నవేళ, ఉబుసు పోక ఊబకాయాన్ని తగ్గించే ప్రయత్నాలేవో చేశా. నేను నాల్రోజులు కనబడకపోతే అమెరికాకు నిద్రపట్టదు. ఒకటే పుకార్లు. ఏంటో వీళ్ల పిచ్చి ప్రేమ. అన్నట్టు, పనిలో పనిగా కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశా. ట్రంప్ మామ కోసం ఓ న్యూక్లియర్ మిస్సైల్ కూడా రెడీ చేశా. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనితరసాధ్యం నా కుటుంబ మార్గం.. నేనే కిమ్ జంగ్ ఉన్!’నా లాక్డౌన్ మిషన్ ఎప్పటికీ.. నార్త్ కొరియా నెవ్వర్ డైస్!’

‘అఖండ భారత్, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా,  స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా... రామనామ జపంలాగా, ఇండియా జపం చేసేదెవరు? ఇంకెవరు? నేనే, నమో అలియాస్ నరేంద్రమోడీ! లాక్డౌన్ చిత్రానికి 1.O నుంచి 4.O దాకా సీక్వెల్స్ తీశా. కరోనా వేళ అందరు సీఎంలతో మన్ కీ బాత్ నిర్వహించా. బిగ్ బాస్ అవతారమెత్తి దేశ ప్రజానీకానికి ఎన్నో టాస్కులిచ్చి ముందుకు నడిపించా. కరోనాపై కదనశంఖానికి యోగాలో ప్రయోగాలెన్నో చేశా. అనాదిగా ఉన్నదే, దేశానికి మరోసారి ఆత్మ నిర్బర మంత్రం నేర్పా. విదేశీయాత్రలు చేయలేకపోయాననే ఒకే ఒక్క బాధ తప్ప, లాక్డౌన్ ని పూర్తిగా ఎంజాయ్ చేశా. నా లాక్డౌన్ మిషన్ పేరు- కరోనా... భారత్ ఛోడోనా?’

‘బొమ్మ పక్కన బొరుసు ఉండాల్సిందే. నిశి చెంత శశి ఉండాల్సిందే. రాహువు జోడీగా కేతువు ఉండాల్సిందే. మోడీ మాటెత్తితే రాహుల్ ప్రస్తావన రావాల్సిందే. ఏంటీ, ఎంట్రీనే తిక్కతిక్కగా ఉందనుకుంటున్నారా? నేనంతే! అముల్ బేబీ అనీ; సొట్ట బుగ్గ సిన్నోడనీ; ఆజన్మ బ్రహ్మచారనీ మీరెన్నైనా జోకులేసుకోండి. నాకవేమీ పట్టవు. నేనెప్పుడో స్థితప్రజ్ఞత సాధించేశా. లాక్డౌన్లో యావత్ప్రపంచాన్ని ఆవాహనం చేసుకుని మరీ దీర్ఘంగా ఆలోచించా. ఆర్థికమాంద్యం భూతంలా కమ్ముకొస్తోంది. ఇప్పుడీ ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ చేతుల్లో పెట్టకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తర్వాత మీ ఇష్టం. ఓకే. రెణ్నెళ్లుగా ప్రయత్నిస్తున్నా... కరోనా బొమ్మకి కొమ్ములు సరిగా రావట్లేదు. పోయి స్కెచ్ ప్రాక్టీస్ చేసుకుంటా, వస్తా. బై! అన్నట్టు నాకే మిషనూ లేదు, ఉండదు, ఉండబోదు.’  


Friday 15 May 2020

జీవితానికో లేఖ!!

డియర్ జిందగీ, 

పూర్వం కవులు మేఘసందేశం పంపేవారట. అంత స్థోమత లేని వాళ్లు కాకితో కబురంపేవారట. కాకి నలుపు నచ్చనివారు ఎంచక్కా కపోత సందేశాలు నడిపారేమో. ఇవన్నీ సాదాసీదా వ్యవహారాలు. రాజరిక ప్రాభవం వేరు. రాజు తలచుకుంటే రాయబారులకు కొదువా? పాండవులైతే ఏకంగా శ్రీకృష్ణుడినే దూతగా పంపారు. ఆపై కలం, కాగితం రాకతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఇప్పుడంతా డిజిటల్ పలకరింపుల శకం. ఇలా లేఖో భిన్న కాలమానస్థితిః! 

చరిత్రలో లింకన్ లేఖ ప్రశస్థమైంది. అది బోధనకు దిశానిర్దేశం చేసింది. అంతెందుకు నెహ్రూ, ఇందిరకు రాసిన లేఖలు సైతం పేరెన్నికగన్నవే. అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు వేశాయి. అంతమాత్రమేనా? ప్రపంచయుద్ధ నియంత్రణకై గాంధీజీ, హిట్లరుకు రాసిన ఉత్తరం; అణ్వాయుధాల విషయమై ఐన్ స్టీన్, రూజ్ వెల్ట్ కి రాసిన లెటర్; సైన్స్,  ఫిలాసఫీ రంగాల్లో ఏంగెల్స్, మార్క్సుకి రాసిన లెటర్స్.. ఇవన్నీ కూడా విశ్వవిఖ్యాతమైనవే. అంతెందుకు, మన విశ్వకవి రవీంద్రుడు సైతం ఆ సర్వేశ్వరుడికి అర్జీ పెట్టుకున్న లేఖలే కదా... గీతాంజలి! ఇలా లేఖల తీరుతెన్నులెన్నెన్నో. లేఖలు కేవలం బంధుమిత్రులు, సన్నిహితులు, అధికారులకేనా? చంద్రునికో నూలుపోగులా, జీవితానికో లేఖ రాయకూడదా? ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ! పైగా, జిందగీ న మిలేగీ దొబారా కూడా!! 

కాలం గమ్మత్తైంది. చిత్రమైంది కూడా. ఎన్నో జ్ఞాపకాల్నిమోసుకొస్తుంది. ఇంకెన్నో స్మృతుల్ని చెరిపేస్తుంది. అది సంజీవనిలా అద్భుతాలు చేయగలదు. వామనపాదమై అధఃపాతాళానికి తొక్కేయనూగలదు. పరుసవేదియై పసిడిరెక్కల్ని విప్పార్చగలదు. కాలకూటవిషయమై యమపాశాన్ని విసరనూగలదు. కురుక్షేత్రమై వినాశనం సృష్టించగలదు. గీతాసారమై విశ్వరూపసందర్శనం చేయించనూగలదు. అంతేనా? ఎంత సారూప్యం. ఇంకెంత వైవిధ్యం. ఎన్ని ఆవిష్కరణలు. ఇంకెన్ని అంతర్ధానాలు. ఎంతటి పురోగతి. ఇంకెంతటి తిరోగమనం. ఇవన్నీ కాలం తాలూకు ఇంద్రజాల మహేంద్రజాలాలే. కరవులు, వరదలు,  భూకంపాలు, సునామీలు, మహమ్మారులు, యుద్ధాలు, మారణహోమాలు...  ఇలా ఎన్నెన్నో! ఈ అనంత పరిణామ క్రమానికి తిరుగులేని సాక్షిభూతం.. కాలచక్రమే!

ఈ కాలగమనంలోనే కరోనా పుట్టుకొచ్చింది. వామనావతారంలా అప్రతిహతంగా పెరిగిపోయింది. దావానలమై ఖండాల్ని చుట్టబెట్టింది. భూగోళాన్ని లాక్డౌన్ చేసింది. ప్రపంచాన్ని క్వారంటైన్ చేసింది. మానవాళిని చిగురుటాకులా వణికించింది. భౌతికదూరం, సహజీవనం అనే రెండు కొత్త తారకమంత్రాలకు పురుడుపోసింది. మహా మహిమాన్విత కాలగ్రంథంలో కరోనా తనకంటూ ఓ పేజీని కేటాయించుకుంది. 

జీవితమనేది చీకటి వెలుగుల రంగేళి - అంటాడో సినీ కవి. కరోనా కూడా జీవితానికి రెండు దృక్కోణాల్ని పరిచయం చేసింది. ఒకటి విమర్శ. రెండోది ఆత్మవిమర్శ. విమర్శలు కోకొల్లలు. కరోనా సృష్టి చైనా పనేనని అమెరికా దుమ్మెత్తిపోసింది. కరోనాను కట్టడి విషయమై ట్రంప్, ప్రపంచ ఆరోగ్యసంస్థను చెడామడా చెడుగుడు ఆడేసుకున్నాడు. కోవిడ్ కల్లోలంపై తాను జనవరిలోనే హెచ్చరిక చేసినా మోడీ పెడచెవిన పెట్టాడని రాహుల్ శాపనార్థాలు పెట్టాడు. కరోనా ఉధృతి తగ్గకముందే మద్యానికి పచ్చజెండా ఊపడమేంటని ప్రతిపక్షాలు కన్నెర్ర చేశాయి. నిజానికి విమర్శ కంటే ఆత్మవిమర్శ శ్రేష్ఠమైంది. ఎందుకంటే, విమర్శ పలాయనవాదాన్ని నేర్పిస్తుంది. ఆత్మవిమర్శ గుణపాఠాన్ని స్వీకరిస్తుంది. ఈ లేఖకు ఆధారం.. ఆత్మపరిశీలనే. 

కరోనా నేర్పిన భౌతిక దూరానికి నవ్య భాష్యం చెప్పి కొత్తపుంతలు తొక్కించాలి. మద్యపానంతో అంటరానితనం పాటించాలి. ధూమపానానికో దణ్ణం పెట్టాలి. గుట్కా వ్యసనానికి గుడ్ బై చెప్పాలి. జంక్ ఫుడ్  జోలికి పోరాదు. కాఫీ, టీల ప్రవాహానికి చెక్ పెట్టాలి. ఫోన్ అతివాాడకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సోషల్  మీడియాతో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. దుబారా ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆడంబరాలను ఆమడదూరం పెట్టాలి. ఎడాపెడా ఉమ్మే నోటికి మాస్కు వేయాలి. చీటికీ మాటికీ ఆస్పత్రుల చుట్టు పరిభ్రమించే అలవాటుకు చెల్లుచీటి పాడాలి.  కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల్ని లాక్డౌన్ చేయాలి. నెగెటివ్ థింకింగుకో నమస్కారం పెట్టాలి. బద్ధకాన్ని క్వారంటైన్లో బందీ చేయాలి. అతినిద్రను ఐసోలేషన్లో పెట్టాలి. ఇలా సరికొత్త జీవనశైలితో భౌతిక, భౌద్ధిక ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలి. 

కరోనా కనువిప్పుతో సహజీవనానికి సరికొత్త సూక్తి ముక్తావళి రచించుకోవాలి. ఫ్యామిలీ టైంని పెంచాలి. బంధాల్ని బలోపేతం చేయాలి. స్నేహ మాధుర్యానికి పెద్దపీట వేయాలి. అభిరుచులకు కొత్త రెక్కలు తొడగాలి. పుస్తకాలతో దోస్తీ చేయాలి. కళాపోషణ, క్రీడారాధనల్ని ద్విగుణం బహుళం చేయాలి. ఐకమత్యమే మహాబలమని చాటాలి. తోటి జీవరాశిపై సఖ్యత చూపాలి. నేల, నింగి, నీరు, నిప్పు, గాలిని చైతన్యంతో వాడుకోవాలి. ప్రకృతిలో లీనమై పరవశించాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి. సామాజిక ఎరుక కలిగి మెలగాలి. 

ఈ కొంగొత్త భౌతిక దూరం, సహజీనవ తారకమంత్రాలే జీవితానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని కాంక్షిస్తూ...

ఇట్లు
మనిషి!!

Monday 11 May 2020

కరోనా తత్వం!!

‘స్వామిజీ, ఒకప్పుడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేది. అదేం చిత్రమో, ఒక్క వైరస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది. భవబంధాల్ని తెంచేసుకుని, ఆశ్రమ జీవితంలోకి అరంగేట్రం చేయించింది. ఐతే, నాదో ధర్మ సందేహం. కరోనా వస్తే క్వారంటైను, లాక్డౌనులేవో వచ్చాయి. మరి, తపస్సు చేస్తే ఏమొస్తుందంటారు?’

‘ఏముందోయ్. ఎడాపెడా చేస్తే నిద్ర. ఏకాగ్రతతో చేస్తే జ్ఞానం. నిద్ర స్థితి తుచ్ఛమైంది. జ్ఞాన సిద్ధి ఉత్కృష్టమైంది. స్థూలంగా, తపఃఫలాలు ఈ రెండే, నాయనా.’

‘లాక్డౌన్ కాలంలో నిద్ర మత్తు నిత్యం అనుభవైకవేద్యమే. ఐనా, సగం జీవితాన్ని నిద్రకే అర్పించా. ఈ క్వారంటైన్ బద్ధక జీవితపు విముక్తి కోసమే మిమ్మల్ని ఆశ్రయించా. కానీ, స్వామీజీ, ధ్యానంలో జ్ఞానోదయమైందని తెలిసేదెలా? న్యూాటన్ మహాశయునిలాగా, ఏ యాపిల్ పండో నెత్తిన పడితేనేగానీ జ్ఞానబల్బు వెలిగిందనే విషయం తెలీదంటారా? లేక,  ముఖంలో తేజస్సు, శిరస్సు వెనక కాంతిపుంజంలాంటివేమైనా దర్శనమిస్తాయంటారా?’

‘హహ్హా! తలపై యాపిల్ పడ్డప్పుడో; తొట్టెలో నీళ్లు ఒలికినప్పుడో మెరుపులా తట్టేవి ఐడియాలోయ్. జ్ఞానజ్యోతి కథ వేరులే. ఈ సమస్త విశ్వం తాలూకు సమగ్ర తత్వం బోధపడితేనే జ్ఞానోదయం. ఆ తత్వం అంతుచిక్కనంతవరకు బతుకంతా అజ్ఞానాంధకార బంధురమే.’

‘అజ్ఞానంతో నాది దశాబ్దాల బంధంలే, స్వామీజీ. ఇక కరోనా రాకతో జీవితంలో నిర్వేదం అలముకుంది. అందుకే, బుద్ధిని కప్పేసిన తమస్సును తొలగించే  తత్వాన్ని ఒడిసిపట్టే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి.’

‘అసతోమా సద్గమయా! అంటే, సత్యమార్గాన్ని చూపే తత్వశాస్త్రాన్ని ఔపోశన పట్టాలి. చీకట్లో నడిచే మనిషికి తత్వశాస్త్రమనేది టార్చిలైటుగా దారి చూపుతుంది, నాయనా.’

‘కానీ గురూజీ, ఫిలాసఫీ అనేది బూజు పట్టిన కాలజ్ఞానమనీ; ఫిలాసఫర్ అనే మాటొక వెటకారపు తిట్టు అనుకునే రోజులివి. అసలీ తత్వశాస్త్రానికి సరైన భాషణమేంటంటారు?’

‘గొప్ప సందేహాన్నే సంధించావోయ్! ప్రకృతి అనంతమైంది, పైగా విశిష్టమైంది. అన్నట్టు, ప్రకృతి నిండా పదార్థమే. ఆ పాదార్థిక భౌతిక ధర్మాలను శోధించేదే ఫిజిక్స్. రసాయనిక నియమాలను నిగ్గుతేల్చేదే కెమిస్ట్రీ. జీవ ధర్మాలను అధ్యయనం చేసేదే బయాలజీ. ఇలా పదార్థం తాలూకు అనేక నిగూఢ రహస్యాలను శోధించే శాస్రాలెన్నో. ఆ శాస్త్రాలు  వెల్లడించే సత్యాలెన్నో. ఐతే, అవన్నీ కూడా ప్రకృతి తాలూకు నిర్దిష్ట సత్యాలు మాత్రమే. ఆ నిర్దిష్ట సత్యాలను వెల్లడించే శాస్త్రాలన్నింటినీ దండగా గుదిగుచ్చి పరిపూర్ణ సత్యాన్ని బోధించి, జీవితానికి మార్గదర్శకం చేసేదే తత్వశాస్త్రమోయ్. నిర్దిష్ట సత్యాన్ని శోధించి, సాధించేవాడు శాస్త్రవేత్త. పరిపూర్ణ సత్యాన్ని ఆవిష్కరించేవాడు తత్వవేత్త.’

‘ఆహా..! మన జీవిత కురుక్షేత్ర సంగ్రామంలో తత్వశాస్త్రమొక బ్రహ్మాస్త్రమంటారైతే. సరే, ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడే విధివిధానాలేంంటో సెలవీయండి, స్వామీ.’

‘ఈ సృష్టిలో శాశ్వతమైంది ఏదీ లేదోయ్. ప్రతిదీ చలనంలో ఉంటుందన్నట్టు. ఇక, మంచీచెడూ, కష్టసుఖాలు, పగలూరేయీ, బొమ్మాబొరుసూ, ఆటుపోటు, చావుపుట్టుకలు.. ఇలా ప్రతీదీ ద్వంద్వాత్మకమే. మార్పు, ద్వంద్వం.. ఈ రెండే ఫిలాసఫీ తాలూకు మౌలిక ధర్మాలు. ఈ ధర్మసూక్ష్మం పట్టుబడితే చాలు, ఫిలాసఫీ దన్నుతో ప్రకృతిలో దేన్నైనా తూర్పారబట్టి, అసలు సారాన్ని అట్టే గ్రహించవచ్చునోయ్.’

‘ఔరా, నిజమా?! ఐతే, కరోనా మహమ్మారికి సైతం ఫిలసాఫికల్ భాష్యం చెప్పవచ్చునా, గురూజీ?’

‘ఓహ్, భేషుగ్గా. ఒకప్పుడు ప్లేగు. ఆపై మశూచి. అటు పిమ్మట కలరా. నేడు కరోనా. ఇదీ మహమ్మారీ క్రిముల మార్పు తాలూకు పరిణామక్రమ చిత్రపటం. ఏదీ శాశ్వతం కాదు, మార్పు తప్పదని రూఢీ చేసే ఘటనలివి. ఇక కరోనా దేశాదేశానికీ కొత్త రూపురేఖలతో ప్రత్యక్షమవుతోంది. నిత్య పరివర్తనమే కరోనా తత్వం. బ్రహ్మాండానికే కాదు, అణువుకూ మహత్తరశక్తి కలదని ఆటంబాంబు చూపింది. రాక్షసబల్లులకే కాదు, వైరస్సకూ అంతే అఖండ శక్తి కలదని కరోనాతో రుజువైంది. ప్రకృతిలోని అంతర్లీన ద్వంద్వ స్వభావమిది. కరోనా రాకతో... మానవాళికి క్వారంటైన్ వాసం దక్కింది. ప్రకృతికి స్వేచ్ఛ లభించింది. మనుషుల్లో అహంకారం తగ్గింది. అప్రమత్తత పెరిగింది. జీవితంలో విశృంఖలత్వం-విలాసాలే కాదు, ఒద్దిక-విలాపాలు కూడా ఉంటాయనే నిష్టురసత్యం ప్రపంచానికి ఎరుకలోకి వచ్చింది. కరోనాకు పేదా పెద్దా తేడాలుండవనీ; మహమ్మారి దేశాల ఎల్లలు చూడదనీ తెలిసొచ్చింది. ప్రకతిలో సమస్థితి వచ్చింది. మనిషికి స్థితప్రజ్ఞత అలవడింది.’

‘ఆహా... సూక్ష్మంలో మోక్షం దర్శనం చేయించారు, స్వామీజీ. చివరాఖరుగా, ఈ కరోనాతో మానవాళి గమ్యం గమనం ఏ సుదూర తీరాలకు దారితీయనుందో భవిష్యద్ధర్శనం చేసి, కాస్త తత్వబోధ చేయండి.’

‘ఏముందోయ్. మార్పు తథ్యం. మార్పే సత్యం. ఒకనాటి ప్లేగు, మశూచి, పోలియోలు ఈనాడు లేవు. కరోనాకైనా అదే సూత్రం. కాకపోతే, కొంతకాలం సహజీనవ సూత్రం తప్పదేమో. శక్తియుక్తుల కన్నా, పరిస్థితులకు తగ్గట్టు ఒదిగిపోయే గుణమే ఏ ప్రాణికైనా శ్రీరామరక్ష అంటాడు డార్విన్ మహాశయుడు. ఈ విషయంలో మనిషి ఓ మెట్టు పైనే ఉంటాడాయే. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో రెండూ తెలిసినవాడే మనిషి. కాబట్టి, ఇప్పటికిప్పుడు మానవాళికొచ్చిన ముప్పేమీ లేదోయ్.’

‘హమ్మయ్యా! ధన్యోస్మి గురూజీ!!’

Thursday 7 May 2020

గీత బోధ!

‘నమస్తే, డాక్టర్!’

‘నమస్తే. చెప్పండి.’

‘ఏం చెప్పమంటారు డాక్టర్. ఒకప్పుడు కృష్ణశాస్త్రి బాధను ప్రపంచం పట్టించుకునేది. అవసరమైతే ప్రపంచం బాధను శ్రీశ్రీ అక్కున చేర్చుకునేవాడు. ప్చ్! కథ మొత్తం అడ్డం తిరిగింది సార్. ఇప్పుడంతా ఒకే కథ. కరోనా వ్యథ. క్వారంటైన్ గాథ. లాక్ డౌన్ బాధ. ఈ కకావికలం... నెవ్వర్బిఫోరూ, ఎవ్వరాఫ్టరండీ.’

‘నీక్కొంచెం తిక్క, ఆ తిక్కకో లెక్క, ఆ లెక్కకో టైమింగు, ఆ టైమింగుకో రైమింగు... ఇలా చాలానే ఉన్నట్టున్నాయ్. ఇండస్ట్రీలో జెండా పాతకపోయావా?’

‘ఊరుకోండి మహానుభావా! నా క్వారంటైన్ ప్రసవ వేదనకే దిక్కు లేదు. ఇక సినీ కళాపోషణ మాట దేవుడెరుగు. జీవితం మరీ బిగ్ బాస్ హౌసులా తయారైంది. పూటకో కష్టం. రోజుకో గండం. ఇవన్నీ రాస్తే రామకోటిని దాటిపోతుంది. తీస్తే కార్తీకదీపం సీరియల్ని మించిపోతుంది. తట్టుకోలేకపోతున్నా సార్.’

‘సర్లేవోయ్. పాండవులకే తప్పలేదు అరణ్య అజ్ఞాతవాసాలు. రాముడంతటి వాడు సైతం వనవాసం తప్పించుకోగలిగాడా? బుద్ధుడైనా బోధిచెట్టు చెంత చిరదీక్షా తపస్సమీక్షణలో బందీ కాలేదా? వాటితో పోలిస్తే నీ క్వారంటైన్ గోడు అసలు ఓ లెక్కలోదేనా? ఊరికే నస కాకపోతే!’

‘ఏంటి సార్ ఈ వివక్ష? సీతమ్మ తల్లిని కాసేపలా పక్కన పెట్టండి. పీత కష్టాలు మాత్రం కష్టాలు కావా? నా కడగండ్లనలా ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా తీసిపారేస్తారా?’

‘సరేనయ్యా. చరిత్రలో ఇదేం కొత్త కాదని మాటవరసకి రెండు ఉదంతాలు చెప్పాలే. పోనివ్వు. తమరి బాదరబందీలేవో ఏకరవు పెట్టండిక.’

‘అదో చాంతాడంత చిట్టా సార్. ఇంటిపట్టునుండి ఉట్టినే తినితినీ, పొట్ట చుట్టుకొలత రెట్టింపైంది. ఫోన్లో వైరస్ వార్తలు చూసీచూసీ దగ్గరిచూపు దగ్ధమైంది. బయటి ప్రపంచంతో సంబంధాలు దూరమై దూరపుచూపు దుమ్ము కొట్టుకుపోయింది. సబ్బులేసి రుద్దీ రుద్దీ చేతులు కొలిమిలోంచి తీసిన చింతనిప్పులయ్యాయి. జుట్టు కీకారణ్యమవడంతో ఓ పక్క శిరోభారం, మరోపక్క వినికిడికి అవాంతరం. ముక్కును మాస్కుతో కప్పీ కప్పీ ఏ వాసనా తెలీట్లేదు. పొద్దస్తమానం పద్మాసనమేసి వెన్నులో పోటొచ్చింది. నడక దూరమై కాళ్లల్లో పట్టు తగ్గింది. శ్రమ కరవై ఒళ్లు గుల్లయ్యింది. అంతేనా, కొలెస్ట్రాల్ మేటలేస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ మొదలైంది. రక్తపోటు రెండో నెంబరు హెచ్చరిక జారీ చేసింది. హార్టు బీటు కాస్త అపశృతి చేస్తోంది.  థైరాయిడ్ తకధిమి తోం నాట్యం చేస్తోంది. విటమిన్లు పాతాళానికి పడిపోయాయి. మొత్తంగా శరీరం లాక్ డౌనై, ఆరోగ్యం క్వారంటైన్ అయిపోయింది మహాప్రభో!! ’

‘వార్నీ బండబడా! చంపేశావుగా. క్వారంటైన్ మైండ్ ఈజ్ కాళకేయాస్ వర్క్ షాప్ అనే కొత్త సామెతను పుట్టించావు. ఇదంతా గూగుల్ తెచ్చిపెట్టిన తలనొప్పిలే. ఇప్పుడు అందరూ పట్టా లేని డాక్టర్లే. సమాచార సునామీలో చిక్కి సొంత శల్యపరీక్షలకు ఒడిగడుతున్నారు. మిథ్యను సత్యమనుకుంటారు. లేని జబ్బును ఉందనుకుంటారు. అణువంత సమస్యను భూతద్దంలో చూసి బ్రహ్మాండం చేసుకుంటారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అనే నానుడి అతికినట్టు సరిపోతుంది.’

‘ఓ మై గాడ్! టక్కున అంత మాటనేశారేంటి సార్. అసలివి సమస్యలే కావంటారా?’

‘పూర్తిగా కొట్టిపారేసే సమస్యలు కావనుకో. కానీ, అంతలా పట్టించుకోవాల్సినంత ఆరోగ్య విపత్తులైతే కావని నా గట్టి నమ్మకం.’

‘అలా కాదు, డాక్టర్. శరీరమనే కాదు. మనసు కూడా తీవ్రంగా గాయపడింది.  తనివితీరా తుమ్మలేం. ధైర్యంగా దగ్గలేం. అయినవాళ్లతోనూ ఆప్యాయంగా మాట్లాడలేం. మాస్కులేని మనిషిని నమ్మలేం. సాటి మనిషితో సరదాగా గడపలేం. టీవీ చూస్తే భయం. పేపర్ చదివితే ఆందోళన. వైరస్ లెక్కలు చూస్తే డిప్రెషన్. ఓవైపు ఓసిడీ. మరోవైపు వెంటాడే కోవిడ్ విభ్రాంతి. కన్ను తెరిస్తే కరోనా. కన్ను మూస్తే కరోనా. బతుకంతా కలగాపులగపు కరోనా అన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి సార్. మానసిక బాధలకు శల్యసారధ్యం వహిస్తున్నానని వీటిని కూడా కొట్టిపారేస్తారా? ’

‘పరిస్థితి కాస్త శృతి మించిందయ్యా. నిజానికిది కరోనా తెచ్చిపెట్టిన క్వారంటైన్ సహిత లాక్ డౌన్ తాలూకు సోషల్ డిస్టెన్స్ వల్ల వచ్చిన సిండ్రొమ్. దీనిపేరు ‘కొవిడ్ ఇండ్యూస్డ్ డెల్యూజనరీ హైపోకాండ్రియాక్ సిండ్రొమ్!’

‘వామ్మో..! అంత పెద్ద జబ్బా? మరి ఇది తగ్గేదెలా, డాక్టర్? ’

‘ప్రస్తుతానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే గీత బోధ. ’

‘అదేంటి డాక్టర్. మనిషి పోయాక కదా, గీత సారం వినిపిస్తారు. జబ్బులకు కూడా గీత బోధ పనిచేస్తుందా?’ 

‘నో నో! నేను చెబుతున్న గీత, సంక్లిష్టమైన భగవద్గీత కాదు. సరళమైన, సూక్ష్మమైన గీత సూత్రం. తరతరాలుగా ఉన్నదే. అదే పెద్దగీత-చిన్నగీత థియరీ. కరోనా అనేది అతి పెద్ద గీత. నీవు ఏకరవు పెట్టిన గోడంతా కలిపి చాలా చిన్న గీత అన్నట్టు. కాబట్టి, అతి చిన్న గీతను మరిచిపో. కావలిస్తే ఆ గీతనే బుర్రలోంచి తుడిచెయ్. కర్కశ కరోనా బారిన పడనందుకు సంతోషించు. ఇక నోటికి మాస్కేసి క్వారంటైన్ చెెయ్. పిచ్చి ఆలోచనలకు తాళమేసి లాక్ డౌన్ చెయ్. నాకు ఫీజు కట్టి బయటకు దయ చెయ్.’ 

‘హ్మ్!’ 

Monday 4 May 2020

అంజలీ మీనన్ దృశ్యకావ్యం... KOODE !!

నింగి కాన్వాస్ పై
హరివిల్లు రంగవల్లి వేస్తే;

నిశి కాగితంపై
మిణుగుర్లు సంతకం చేస్తే

నిశ్శబ్ద వీణపై
మాట సమ్మోహనరాగం మీటితే

నిర్వేద ఛాయల్ని
సంతోషాల సంజీవనేదో మాయం చేస్తే..

అది అంజలీ మీనన్ తీసిన దృశ్యకావ్యం ‘Koode’ (Together) సినిమా అవుతుంది!!

నిన్న రాత్రి నేను... ఫ్రెండ్ మురళీ ఇంట్లో ఉన్నా. ఇంకో ఫ్రెండ్ క్రాంతి కూడా అక్కడే ఉన్నాడు.  డిన్నర్ కి కూచునే ముందు ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూద్దామనిపించింది. అదే విషయం మురళీకి చెప్పా. మురళీ కాసేపు సెర్చ్ చేసి అంజలీ మీనన్ తీసిన ‘koode’ అనే మూవీ పెట్టాడు. హాట్ స్టార్ లో ఉందిది. తారాగణం పృథ్విరాజ్, నజ్రియా, పార్వతి వగైరా.

కథగా చెప్పుకుంటే.. సింపుల్ లైనే. అన్నాచెల్లెళ్ల మధ్య అల్లుకున్న భావోద్వేగాల ప్రయాణం. ఇంకాస్త సంక్షిప్తంగా విశదీకరించే ప్రయత్నం చేస్తా. అమ్మానాన్నా ఓ అబ్బాయి కలిగిన ఓ చిన్ని కుటుంబం. ఆ ఫ్యామిలీలోకి ఓ పాప నాలుగో వ్యక్తిగా ప్రవేశిస్తుంది. ఐతే, ప్రాణాంతక జబ్బుతో పుట్టిన ఆ పాప ఎక్కువకాలం బతకదని తెలుస్తుంది. నాన్నేమో మెకానిక్. తనకొచ్చే సంపాదన ఆ పాప మెడిసిన్స్ కి కూడా సరిపోని పరిస్థితి. ఈ సిచుయేషన్లో  చెల్లిని సాధ్యమైనంత ఎక్కువకాలం బతికించుకోవాలనే తపనతో అన్నయ్య (హీరో) చిన్నతనంలోనే గల్ఫ్ కెళతాడు. అలా ఏళ్లపాటు గల్ఫ్ లో పనిచేస్తున్న అన్నయ్యకు చెల్లి మరణవార్త తెలుస్తుంది. ఇండియా తిరిగొచ్చాక చెల్లి జ్ఞాపకాలతో, తనకు మాత్రమే కనిపించే చెల్లితో అన్నయ్య సాగించే ఎమోషనల్ జర్నీనే...  ఈ మూవీ.

ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే... ప్రతీ పాత్ర కూడా...  ఇంకో పాత్ర తాలూకు హ్యాపీనెస్ కోసం పాటుపడడం. చెల్లి ఆరోగ్యం కోసం అన్నయ్య చదువు మానేసి గల్ఫ్ కెళతాడు. అన్నయ్య జీవితంలోంచి వేదనను తొలగించి సంతోషాన్ని నింపాలనే తాపత్రయం చెల్లిది. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఆనందం పంచాలని తాపత్రయపడే పాత్ర ఇంకోటి. కష్టాల్లో ఉన్న గురువును ఆదుకోవాలని ప్రయత్నించే పాత్ర మరొకటి. చిన్ననాటి కొడుకు కలకు ఓ అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చే నాన్న. ఉట్టి కాళ్లతో ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలకు కొత్త షూ తొడిగే హీరో. ఇలా ప్రతీ పాత్రలోను ఎంత కొంత త్యాగం చేసి, పక్క వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే ఇంపర్సనల్ నేచర్ కనిపిస్తుంది. నిజానికి సినిమా ఆరంభంలోనే స్కూల్లో... ప్రార్థన గీతం కింద విశ్వకవి రవీంద్రుడి where the mind is without fear అనే పోయెంతో మొదలవుతుంది. డైరెక్టర్ తాలూకు అభిరుచి, బ్రాడ్ నెస్ కు ఆ సీన్ ఓ ప్రతీక. ఇక ప్రతీ సన్నివేశాన్ని ఓ దృశ్యకావ్యంగా మలచడంలో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తీసుకున్న శ్రమ, శ్రద్ధ వెలకట్టలేనివి. అలాగే ప్రతీ సన్నివేశాన్నీ ఎమోషనల్ గా ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పాత్ర కూడా చెప్పుకోతగ్గదే.

ఈ మూవీలో చిన్నతనంలోనే కుటుంబానికి, అనుబంధాలకు దూరమై ఎక్కడో సుదూర దేశంలో ఏళ్ల తరబడి పెట్రోల్ బావుల్లో పనిచేసి ముభావిగా, ఏ ఫీలింగూ పైకి కనిపించని అంతుబట్టని వ్యక్తిగా పృథ్విరాజ్ చక్కగా నటించాడు. ఇక, తన ఆరోగ్యం కోసం ఎక్కడో శ్రమిస్తున్న ప్రత్యక్షంగా కనిపించని అన్న కోసం జ్ఞాపకాలను క్రియేట్ చేసి, భద్రపరచి, ఆ తర్వాత అన్నయ్య తిరిగొచ్చాక ఆయన ఆనందం కోసం, భవిష్యత్తుకోసం పరితపించే చెల్లిగా నజ్రియా నటనే ఈ మూవీకి ఆయువుపట్టు. ఇక, మ్యారిటల్ రిలేషన్ తెగదెంపులు చేసుకుని, అనేక అవమానాలను భరిస్తూ ప్రవాహానికి ఎదురీతే పాత్రలో పార్వతి నటన సింప్లీ సూపర్బ్. సినిమా ఆద్యంతం అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తూ చివరకు పాజిటివ్ నోట్ తో మూవీని ముగించడం అభినందనీయం. చార్లీచాప్లిన్ మూవీస్ లో సినిమా ఆద్యంతం ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నా చివరకి ఓ పాజిటివ్ నోట్ తో మూవీ ముగుస్తుంది. జీవితం పట్ల ఆ డైరెక్టర్ తాలూకు ఆశావహ దృక్పథాన్ని అది సూచిస్తుంది.  బాక్సాఫీస్ హిట్, ఫ్లాపులనే ఫార్ములాకు అతీతంగా కొందరు సినిమాల్ని చిత్రీకరిస్తారు. అంజలీ మీనన్ ఆ కోవలోకే వస్తారు. చూసినంత సేపు ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి, చూశాక చాలాకాలం పాటు మనల్ని వెంటాడే మూవీ.. ఈ koode !


కష్టజీవి క్వారంటైన్ వాసం!!

‘హాయ్, నా పేరు కరోనా! ’

‘నా పేరు కష్టజీవిలే! మా బాధల్ని వంద రెట్లు పెంచి, మా బతుకుల్ని భయాల బందీకానాలో బిగించిన దుష్టజీవివి నీవేనా? ’

‘ఊ. ఎలా ఉన్నారు?’

‘ఏవుంది?! రాళ్లూరప్పలున్నాయి. కొండలు గుట్టలున్నాయి. గొడ్డూ గోదా ఉంది. మేమూ ఉన్నాం. అంతే. పెద్ద తేడాయేం లేదు. మొన్నటిదాకా కనీసం నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేవి. నీవొచ్చాక ఆ పిడికెడు మెతుకులకీ కటకటే. దొరికితే అన్నంతోనో, అంబలితోనో సరిపెట్టుకుంటాం. దొరక్కపోతే పస్తులే. ఇంతకీ, నీవింకెంతకాలం ఉంటావిక్కడ?’

‘ఏమో! వాన రాకడ, వైరస్ పోకడ అగమ్యగోచరట కదా. నా పుట్టుక, మనుగడ, చావు.. ఇవేవీ నా చేతుల్లో లేవు. మీ క్వారంటైను, లాక్ డౌన్లే నా పాలిట రాహుకేతువులట కదా.’

‘ఖర్మ! పల్లెల్లో పొలం పనుల్లేవు. పట్నంలో కూలీనాలీ లేదు. కాలు గడప దాటే పరిస్థితి లేదు. ధరలేమో కొండెక్కాయి. దాచుకున్న కాస్త రొక్కం నెల తిరక్కుండానే ఆవిరైపోయింది. తల తాకట్టు పెడదామన్నా అప్పు పుట్టే దారి లేదు. ఏం కలికాలం వచ్చెరా భగవంతుడా! నీ రాక మా సావుకొచ్చింది.’

‘నా విలనిజం, అప్రదిష్ట గురించి కొత్తగా చెప్పేదేముందిలే గానీ, ఐనా, ఇలాంటి సంకటవేళ, మీ కష్టసుఖాల్ని పట్టించుకొనే నాథుడే లేడా?’

‘హ్మ్. అదో అంతులేని కథలే. తెల్లోళ్ల పాలన పోయి డెబ్భై ఏళ్లు  దాటిపాయే. మా బతుకు సిత్రం మాత్రం బండారయి చందమాయే. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయే. పార్టీలు పుట్టగొడుగులాయే. కప్పదాటు రాజకీయాల కాలమాయే. ఊసరవెల్లి నేతలకు కొదవేలేదాయే. కొందరి నినాదమేమో గరీబీ హఠావో! కొందరిదేమో రోటీ, కప్డా ఔర్ మకాన్. ఇంకొందరిదేమో సబ్ కా వికాస్! ఇత్యాది హామీలకు లెక్కేలేదు. చేసిన వాగ్దానాలకు దిక్కు లేదు. కపటత్వానికి కొదవే లేదు. దరిద్ర రేఖేమో ఎవరెస్టులా పెరిగిపాయే. మా బతుకులేమో ఇట్టా పాతాళానికి పడిపాయె.’

‘అయ్యోరామా! ఎంత దారుణం? సేద్యం చేసేది మీరు. కాల్వలు తవ్వేది మీరు. డ్యాములు కట్టేది మీరే. భవంతుల్ని లేపేది మీరే. రహదారుల్ని వేసేది మీరే. రైల్వేల్ని నిర్మించేది మీరే. కార్మాగారాల్ని నడిపేదీ మీరే. మొత్తం నాగరికతా రథాచక్రాల ఇరుసులూ మీరే. దాన్ని లాగే కాడెద్దులూ మీరే. ఈ వ్యవస్థ ఆయువుపట్టే మీరు. మీరు లేనిదే, ఈ సమాజానికి దిక్కూ మొక్కంటూ ఉంటుందా అసలు? అలాంటి మీ జీవితాల్లో ఇన్నేళ్లైనా ఎదుగూబొదుగూ లేకపోవడం దారుణాతిదారుణం?’

‘ఏం చెప్పమంటావులే! మాది గొంతు దాటని గోడు. కంచికి చేరని కట్టుకథ. నాదీ, మా తాతముత్తాతలదీ, వాళ్ల తాతముత్తాతలదీ అందరిదీ.. అదే కథ. ఒకే వ్యథ. తరాలు మారినా మా వెతల తీరు మాత్రం మారలేదు. మహాభారత కాలంలో బానిసలై పశువులు మేపాం. రామాయణ కాలంలో బోయీలమై మేనాలు మోశాం. గుప్తులు, మొఘళ్ల కాలంలో సైన్యమై యుద్ధం చేశాం. ప్రజాస్వామ్యపు ఫ్యాక్టరీ గొట్టాల్లో పొగ చూరిపోతున్నాం. ఇకపై కూడా ఏదో ఓ శ్రమ తప్పక చేస్తాం. కాయకష్టం తీరు మారొచ్చేమో. అంతే. మా బతుకు దుస్థితి సిత్రంలో ఏ మార్పూ ఉండదనుకుంటా. మేము చరిత్రహీనులమేమో!’

‘ఎంతటి చోద్యం?! అసలు మీ చరిత్రను ఏ వాల్మీకో, వ్యాసుడో గ్రంథస్థం చేయలేదా? మీ గాథలకు ఏ బెంగాలీ రాయ్ బహదూర్ సాహెబో, పాశ్చాత్య చాప్లిన్ మహాశయుడో దృశ్యరూపం ఇవ్వలేదా?’

‘అయ్యో రాత! చేతికింత పని, నోటికింత తిండి, కంటికింత కునుకు... మా బతుకుచక్రానికదే నిత్య కృత్యం. మాకదే సత్యం. అదే శాశ్వతం. ఐనా, కష్టజీవులకు కథలు, కాకరకాయలేంటట? ఐనా, ఆ కళాపోషణంతా కడుపు నిండినోడి పని. ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడి కైన ఖర్చులు, మతలబలుూ, కైఫీయతులూ చరిత్ర సారమింతేనని ఆ పెద్దమనిషెవరో బానే చెప్పారుగా.’

‘హతవిధీ! చరిత్ర రూపశిల్పులే మీరు. ఆ చారిత్రక ఇతిహాసపు పుటల్లో మీకంటూ ఓ పేజీ కూడా లేకపోవడం శోచనీయం. అన్నట్టు, నేడున్నది ప్రజాస్వామ్యమేగా. ప్రజలకోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అంటూ ఏకంగా రాజ్యాంగమే రాశారుగా. మీ జీవితాల్లోకేమైనా వెలుగు రేఖ ప్రసరించిందా మరి?’

‘అయ్యోరామా! రాతలు వేరు. చేతలు వేరు. ఆ రాతలకి, చేతలకి మధ్య ఎప్పుడూ చైనాగోడంత ఎడం ఉంటుంది. మైసూరు బజ్జీలో మైసూరు ఎలాగైతే ఉండదో; ప్రజాస్వామ్యంలో కూడా మాబోటి జనాలెవ్వరూ ఉండరనుకుంటా. అలాగే, ఎండమావిలో నీళ్లెలా ఉండవో; ప్రభుత్వాల పథకాలు, కమీషన్లు, నిధులు, చట్టాల్లో పేదల ఊసే ఉండదు. ఓట్ల కోసమే మేం గుర్తొస్తాం. ఎన్నికలయ్యాక నేతలది అవినీతి భాగోతం. మాకేమో కటిక దరిద్ర భారతం. మా తలరాత ఎప్పుడు మారుద్దో?’

‘హ్మ్! ఏదోరోజున మీకూ మంచికాలం వచ్చి తీరుతుందన్నది నా ఆశ, ఆకాంక్ష.’

‘ఇంకెక్కడి మంచిరోజులు? నీవు మొదలెట్టిన రావణకాష్టంలో ఎక్కువగా సమిధలయ్యేది మాబోటి కష్టజీవులే. భూగోళంపై నీవు సాగిస్తున్న దారుణ మారణ హోమం తాలూకు సెగలు ఎప్పటికీ తగ్గుతాయో? ఈ క్వారంటైన్ వాసం ముగిసినా మా బతుకులు తిరిగి యథాస్థితికి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో? రానున్నదంతా ఆత్మహత్యలు, హాహాకారాల కాలమేనేమో?!’

‘భగవంతుడా! ఆ కూర్మావతారం ఉందో లేదో నాకైతే తెలీదు. కానీ, అనాదిగా ఈ భూమండలాన్ని మోస్తున్న ప్రత్యక్ష నరనారయణులు మాత్రం మీరే. మీలాంటి అభాగ్యుల, అసహాయుల ఉసురు పోసుకుంటున్న నాకు ఇక ఈ భూమ్మీద పుట్టగతులుంటాయో, లేదో తెలీదు. మన్నించు మిత్రమా! అన్నట్టు, కొంచెం శుచీ శుభ్రత పాటించండి. కాస్త బాధాకారమే ఐనా కొన్నాళ్లు క్వారంటైన్ వాసం చేయండి. దొరికితే కలో, గంజో తాగండి. అవీ దొరక్కపోతే, చివరకు బలసాకైనా తిని సరే బతకండి. మీరు బతకాలన్నదే నా కోరిక.’

‘మా తక్షణ కర్తవ్యం, తదేక దీక్ష మాత్రం, కరోనా రహిత సమాజమే!’