Thursday 26 March 2020

కరోనా - కొండపొలం - బ్లాగ్ పునఃసందర్శన!!


హిరోషిమా, నాగసాకి ఉదంతాల్ని తలచుకున్నప్పుడు అనిపిస్తుంది... బ్రహ్మాండంలోనే కాదు, అణువులోనూ అంతే బలముందని! అలాగే, ప్లేగు, కలరా, మశూచి, కరోనా లాంటివి ప్రబలినప్పుడు అనిపిస్తుంది... ఆలోచన అనే ఆయుధం కలిగిన మనిషే కాదు, అస్సలు కంటికి కూడా కనిపించని సూక్ష్మజీవులు కూడా అంతే బలమైనవని!! ఏదైతేనేం, కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయి, మనుషులంతా ఇళ్లకే పరిమితమైన కాలంలో; ఎవరి తాహతు మేరకు వాళ్లు ప్రస్తుత ఈ డిజడ్వాంటేజ్ సమయాన్ని అడ్వాంటేజ్ కింద మార్చుకోక తప్పదు. అలాంటి ఎందరి తాలూకు, ఎన్నో ప్రయత్నాల్లో భాగంగానే నేనూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాల్ని చదవడం, అలా చదివిన దాని గురించి బ్లాగ్ రాయడమనే పనికి ఒడిగట్టాల్సి వచ్చింది. 

ఈ ఏడాది (2020) ఆరంభంలో ఓ తీర్మానం తీసుకున్నా. ఈ పన్నెండు నెలలూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిద్దామని. అందులో భాగంగానే జనవరిలో సైక్లింగ్ చేశా. ఆ నెలలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేశా. పాండిచ్చెరి నుండి కొడైకెనాల్ దాకా ఓ అయిదు రోజుల పాటు 400 కిలోమీటర్ల సైక్లింగ్ ఈవెంట్ కూడా విజయవంతంగానే పూర్తి చేశాను. మొత్తానికి జనవరి నెల... నా ఫిట్ నెస్ ఫర్వాలేదని ఓ సర్టిఫికెట్ ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి నెలంతా షుగర్, మిల్క్ మానేశా. నిజానికి నేను ‘టీ’ అడిక్ట్ ని. అయిదానికీ కానిదానికీ టీ తాగే అలవాటు చిన్నప్పటి నుండే రావడంతో దాన్ని మానడం అంటే నా మటుకు నాకు ఓ యజ్ఞమే. అయినప్పటికీ నా మీద నాకు ఎంత కంట్రోల్ ఉందో పరీక్షించుకోవడానికే ఈ మిల్క్ + షుగర్ మానే ప్రయత్నం చేశా. అదీ సక్సెస్ ఫుల్ గానే ముగిసింది. ఆ రకంగా ఫిబ్రవరి.. నా మైండ్ కంట్రోల్ ఫర్వాలేదని భుజం తట్టి సెభాష్ అంది.  

ఇక మార్చి నెల వంతు. మార్చి నెలలో వీలైనన్ని బుక్స్ చదవాలని ప్లాన్. నిజానికి నా బుక్ రీడింగ్ హ్యాబిట్ కర్నూల్లో మొదలైంది. డిగ్రీ పూర్తయ్యాక, ఓ ఏడాదిపాటు చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ, చాలా టైం ఖాళీగా మిగిలేది. నిజానికి Empty mind is a devil's workshop అనంటారు కదా. లక్కీగా నాకెలా అలవడిందో డిగ్రీ నుండే పేపర్లో స్పోర్ట్స్ వార్తలు చదవడమొక హ్యాబిట్ గా ఉండేది. దాంతో బతికిపోయానేమో. రోజు పొద్దున్నే గ్రౌండుకెళ్లడం, అదయ్యాక కర్నూల్లో సెంట్రల్ లైబ్రరీకెళ్లడం, ఆపై అక్కడే మెంబర్ షిప్ తీసుకుని బుక్స్ చదవడం అలవాటైంది. ఇదంతా ఇష్టం కొద్దీ చేసిన పని. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూలుకి సెలెక్ట్ అయి హైదరాబాద్  వచ్చాక ఇక్కడ ఏడాది శిక్షణా టైంలో ప్రతీవారం ఓ పుస్తకం చదవాల్సి వచ్చింది. ఇక్కడ బుక్ రీడింగ్ అన్నది బలవంతంగా చేయాల్సి వచ్చిన పని. ఏదైతేనేం బుక్స్ చదవడం అన్నది అలవాటైంది. ఆ రకంగా నా థింకింగ్ తాలూకు కాన్వాస్ ఈ బుక్ రీడింగ్ వల్ల ఎంతో కొంత పెరిగిందనే చెప్పాలి. 2002-03 ఈనాడు జర్నలిజంలో ట్రైనింగ్ పూర్తయి, రెగ్యులర్ జాబులో పడ్డాక, అప్పుడప్పుడు ఒకటి అరా పుస్తకాలు చదవడం తప్ప, రెగ్యులర్ బుక్ రీడింగ్ అలవాటు ఆల్మోస్ట్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే దాన్ని తిరగదోడుదామని అనిపించింది.

అందుకే మార్చ్ నెలని బుక్ రీడింగ్ కి కేటాయించా. మొదట్లో డాక్టర్ కేశవరెడ్డి బుక్స్ కొన్ని ఆన్  లైన్లో చదివేశా. నిజానికవి అంతకుముందు చదివినవే. అంతకుముందెప్పుడో - ఈ బుక్ నీకు నచ్చుతుంది చూడు, చదువమని ‘ఒంటరి’ అనే పుస్తకాన్ని - ఇచ్చారు సమ్మెట  నాగమల్లేశ్వరరావు సర్ (ఆలిండియా రేడియో). ఆ ఒంటరి పుస్తకాన్ని చదువుదామనుకుంటుండగానే మురళీ (బ్లాగర్) దగ్గర ‘కొండపొలం’ పుస్తకం తీసుకున్నా. ఈ రెండు పుస్తకాల్ని రాసింది సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారే. ఐతే ‘ఒంటరి’ కన్నా ముందుగా ‘కొండపొలమే’ చదివేశా. అదయ్యాక ‘ఒంటరి’ కూడా చదివేశా. ఈ ‘కొండపొలం’ చదివాకా నేను ఫీలైన విషయాలను గుదిగుచ్చి ఏదైనా చిన్న రైటప్ రాద్దామనిపించింది. ఈ క్రమంలోనే మూలనపడ్డ బ్లాగును దుమ్ము దులపాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ పోస్టు.

ఇక ‘కొండపొలం’ నవల విషయానికొద్దాం. కథ గురించి టూకీగా చెప్పాలంటే, దాదాపు 50 రోజుల పాటు నల్లమల అడవుల్లో గొర్ల కాపరిగా ‘రవి’ అనే యువకుడు సాగించిన ప్రయాణం ఈ నవల! అడవిలో పిరికివాడుగా మొదలై ధైర్యవంతునిగా తననుతాను మలచుకున్న యువకుడి ప్రయాణమది. నల్లమలలోని చెట్టూ చేమలతో, కొండాకోనలతో, పక్షులతో, జంతువులతో, అడవి పుత్రులతో బంధాల్ని పెనవేసుకుంటూ రవి సాగించిన పయనమది. నగరం దెబ్బకు కుదేలైపోతున్న ప్రకృతి, పల్లెల తాలూకు మౌనరోదనను మననం చేసుకుంటూ ఓ యువకుడు చేసిన జర్నీ అది. మనిషి మనుగడకోసం ఈ అడవి ఎన్నో సమకూర్చింది, అలాంటి అడవికి మనవంతుగా తిరిగి ఏదైనా ఇవ్వాలని సంకల్పించిన ఓ యువకుడి ఆరాటమిది. అందరిలాగే ఇంజినీరింగ్ చేసి ఏ సాఫ్ట్ వేర్ జాబులోనో సెటిలైపోవాలని తలపెట్టి, చివరికి పల్లెలకు, ప్రకృతికి తనవంతు బాధ్యతగా మంచి చేయాలని అటవీశాఖాధికారిగా మార్పు చెందిన ఓ యువకుడి మార్పు ప్రస్థానమది.

జనరల్ గా మనం కొన్నింటికి/కొందరికి కనెక్ట్ అయినట్టుగా; ఇంకొన్నిటి/ఇంకొందరి విషయంలో అంతగా కనెక్ట్ అవలేము. బహుశా, అది మనం పుట్టి పెరిగే క్రమంలో అలవడిన అలవాట్ల, అబ్బిన సంస్కారాల వల్ల కావచ్చు. ఈ రకంగానే మనకు కొన్ని నిర్దిష్టమైన ఇష్టాయిష్టాలు ఏర్పడతాయనిపిస్తుంది. అఫ్ కోర్స్, ఇలా సంక్రమించిన అలవాట్ల/సంస్కారాల బంధనాలను దాటుకుని కొత్తవాటికి కనెక్ట్ అయ్యే ‘అడాప్షన్’ అనే గొప్ప ప్రక్రియ గురించి కూడా డార్విన్ మహాశయుడు ఏనాడో చెప్పాడనుకోండి. అదింకో విషయం. నా వరకు - సాహిత్యానికి సంబంధించినంత వరకు - శ్రీశ్రీకి కనెక్ట్ అయినంతగా కృష్ణశాస్త్రికి కనెక్ట్ అవలేకపోయా; శరత్ నచ్చినంతగా చలం నచ్చలేదు; రియలిజానికి కనెక్ట్ అయినంతగా ఫిక్షన్ కు కనెక్ట్ అవలేకపోయా. అడపాదడపా నా కంఫర్టబుల్ జోన్ ని నుండి బయటకొచ్చి చదివిన సాహిత్యం కూడా కొంత ఉందనుకోండి. అది అడాప్షన్ కిందకు వస్తుందేమో! ఇక, కొన్ని సందర్భాల్లో చాలామంది ఆహా.. ఓహో.. అని మెచ్చుకున్న కవుల/కథకుల సాహిత్యానికి ఎంతగా దగ్గరవుదామని ప్రయత్నించినా... అబ్బే, అస్సలంటే అస్సలు కుదర్లేదు. అడాప్షన్ ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు. బహుశా, ప్రకృతిలో ‘అలర్జీ’ అనే ఇంకో ప్రక్రియ దాన్ని అడ్డుకుంటుందేమో! పోన్లే, ఈ టాపిక్ ని ఇక్కడికి ఆపేద్దాం.

ఇక, నా స్టడీస్ అండ్ జాబ్ రీత్యా కర్నూలుతో ఏర్పడిన బంధం వల్ల కావచ్చు, అలాగే నల్లమలలోని దాదాపు అన్నిక్షేత్రాలను సందర్శించి ఉండడం వల్ల కావచ్చు, మరీ ముఖ్యంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూరా ఆకాశాన్నంటి నిలుచున్న కొండలన్నింటినీ ట్రెక్కింగ్ చేసి ఉండడం వల్ల కావచ్చు,  ఈ ‘కొండపొలం’ పుస్తకం నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే, రైతు కుటంబ నేపథ్యం ఒకటి ఉండడం, మా ఊళ్లో గొర్ల కాపర్ల జీవితాల్ని దగ్గరినుండి చూడడం వల్ల కూడా ఈ పుస్తకానికి నేను బాగా కనెక్ట్ అయ్యానేమో. అలాగే, ప్రతీ ప్రాంతానికీ భాషలో, సంప్రదాయాల్లో, మనుషుల జీవనవిధానంలో దానికే సొంతమైన ఓ ‘ఫ్లేవర్’ ఉంటుంది. రాయలసీమకు కూడా అలాంటి ఫ్లేవర్ ఒకటుంటుంది. కొండపొలం నవలకు కూడా సీమ ఫ్లేవర్ ఉండడం వల్లో, ఏమో నాకు బాగా నచ్చిందిది. ఐతే, ఈ భాషల/యాసల/ప్రాంతాల/ జీవన విధానాల పరిధిని దాటి అందరికీ నచ్చే ‘యూనివర్శల్ అపీల్’ కొన్ని పుస్తకాలకు ఉంటుంది. అలాంటి యూనివర్శల్ అపీల్ కూడా ఈ ‘కొండపొలం’ పుస్తకానికి తగినంత ఉందని చెప్పొచ్చు.

అనంతమైన పరిణామ క్రమంలో, ఈ విశాలవిశ్వంలోని ఒకానొక పాలపుంతలో, ఒకానొక గ్రహంపై, ఇనార్గానిక్ (కార్బన్ రహిత) పదార్థం... ఆర్గానిక్ (కార్బన్ కలిగిన) పదార్థంగా పరిణామం చెంది, ఆపై జీవం (లైఫ్) ఉనికిలోకి వచ్చి, ఆపై ఏకకణ- తర్వాత బహుకణ - అనంతరం వెన్నెముక కలిగిన - దాని తర్వాత సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కలిగిన జీవులు గా పరిణామం చెంది, ఆపై సెరెబ్రల్ కార్టెక్స్ కలిగి ‘ఆలోచన’ చేయగలిగిన మనిషి ఆవిర్భావం దాకా ఎన్ని లక్షల ఏళ్లు గడిచాయో లెక్కగట్టడం కష్టసాధ్యమేనేమో. ప్రారంభదశలో అంటే - పళ్లు ఫలాలను తిని, జంతువులను వేటాడినంత కాలం - మనిషి సంచారజీవిగానే ఉన్నాడు. ఎప్పుడైతే, వ్యవసాయం కనిపెట్టాడో అప్పుడే స్థిర నివాసం అవసరమైంది. ఆ క్రమంలోనే అనేక సివిలైజేషన్లు పుట్టుకొచ్చాయి. ఐతే, ఈ వ్యవయాానికి సంబంధించి, నాటి అనాగరిక దశ నుండి నేటి ఆధునిక దశ దాకా కూడా ‘కరవు’ అనేది మనిషికి అనంతంగా సవాల్ విసరుతూనే ఉంది. ఈ ‘కరవే’ ఈ ‘కొండపొలం’ నవలకు కథా వస్తువు.

ఈ ‘మనిషి’ అనే వాడొక అద్భుతం అనిపిస్తుంటుంది. ఈ సమస్త ప్రకృతి అంతా ఒకవైపు నిలిస్తే, ఆ ప్రకృతిలోంచే పుట్టుకొచ్చి, దానికి ఎదురుగా ఇంకోవైపున నిలవగలిగిన దమ్ము, ధైర్యం, చైతన్యం ఒక్క ‘మనిషి’కే ఉన్నాయనిపిస్తుంది. ప్రకృతిలోని నింగీ నీరూ నిప్పూ నేలా లాంటి వాటి ధర్మాలను తెలుసుకుని, వాటిని వశపరచుకుని, అగ్రికల్చరనీ, చేతివృత్తులనీ, హస్తకళలనీ, కళలనీ, సాహిత్యమనీ, డ్యాములనీ, స్టీము ఇంజెన్లనీ, పవర్ లూమ్స్ అనీ, భారీ పరిశ్రమలనీ, నౌకాయానమనీ, విమానయానమనీ, రోదసీ పయనాలనీ ఇలా ఒకటా రెండా కొన్ని వందల, వేల, లక్షల అద్భుతాలు చేశాడీ ‘మనిషి’. కేవలం ఈ ‘మనిషి’ సాంగత్యం వల్లనే, ఈ ‘మనిషి’ కి టచ్ లోకి వచ్చిన కారణంగానే తమతమ క్రూడ్ క్వాలిటీలను సైతం ఫైనెస్ట్ గా మెరుగుపరచుకున్న Parrot, Eagle, Dog, Horse లాంటి పక్షులు, జంతువులకైతే లెక్కేలేదు. ఈ క్రమంలోనే ప్రకృతితో, ప్రకృతిలోని చెట్టూచేమతో, కొండాకోనతో, పక్షులతో, జంతువులతో, సకల ప్రాణులతో ఒక రకమైన ఆర్గానిక్ సంబంధ బాంధవ్యాల్ని ఏర్పరచుకున్నాడీ ‘మనిషి’. మరీ ముఖ్యంగా వ్యవసాయంతో పాటే మరొక అనుబంధ ఆహార వనరుగా ‘పశుపోషణ’ను అనాదిగా అక్కున చేర్చుకున్నాడీ మనిషి. అందుకే మనిషికి నేలతో పాటే, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్లతో ఇప్పటికీ అలవికాని బంధం. ఈ కొండపొలంలో నవల్లో కూడా ‘కరవు’ కోరలు చాచిన సమయంలో తనతో పాటే, తమనే నమ్ముకుని బతికే జీవాలైన ‘గొర్ల’ను ఎలాగైనా బతికి బట్ట కట్టించాలనే ‘మనిషి’ తాలూకు తపనే ఈ నవలకు ఆయువుపట్టు. (ఈ పేరాలో కేవలం మనిషి సాధించిన ‘మంచి’నే హైలైట్ చేశా. ఈ క్రమంలో మనిషి కలుగజేసిన ‘చెడు’ తాలూకు నెగెటివ్ పార్శ్వాన్ని నేను ఇక్కడ స్పృశించలేదు.)

మనిషి ప్రస్థానం ఎక్కడో అడవుల్లోని గూడెం, తాండాలు దాటుకుని గ్రామాలు, పట్టణాలు, నగరాల దాకా; ఆటవిక సంచార జీవితం నుండి ఆధునిక సివిలైజేషన్ల దాకా; ఆదిమ-బానిస-రాజరిక-ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా అనేక రూపాల్లో విలసిల్లుతూ పరిణామం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మనం ప్రపంచీకరణ దాకా వచ్చాం. ఇదొక సంధి దశ. ఈ దశలోనే నగరాలు పల్లెటూళ్లను మింగేస్తున్నాయి. పరిశ్రమలు వ్యవసాయాన్ని కబళించేస్తున్నాయి. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ముడిపడ్డ వృత్తుల ఉనికికే ప్రమాదం ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో జీవిస్తున్నాం మనం. ఈ విపత్కర పరిస్థితుల్నే ఆలోచనాత్మకంగా, మానవీయంగా డిస్కస్ చేస్తుంది... ఈ కొండపొలం.

రచయిత సన్నపురెడ్డి వెంకట్రా మిరెడ్డి తన ఒంటరి, కొండపొలం నవలల్లో చర్చకు లేవనెత్తిన విషయాలైన.... పరిశ్రమలు Vs వ్యవసాయం; నగరాలు Vs పల్లెటూళ్ల మధ్య నెలకొన్న శత్రుపూరితమైన వైరుధ్యాన్ని తొలగించి, ఒకదానికొకటి చేదోడువాదోడుగా నిలిచే వాతావరణం నెలకొనే మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి!